వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న మద్యం స్కామ్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ వేదికగా చేసిన ఆరోపణలపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఎంపీకి తన కార్యాలయానికి పిలుపించుకుని ఏపీ లిక్కర్ స్కామ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఎంపీని తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు సేకరించారు.
సోమవారం లోక్సభ టీడీపీ ఎంపీ లావు మాట్లాడుతూ, ఏపీలో మద్యం స్కాంకు కారకులైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈడీ వంటి సంస్థలతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా శ్రీకృష్ణదేవరాయలను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకున్న హోం మంత్రి అమిత్ షా ఆయనను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఢిల్లీ మద్యం స్కాంతో పోల్చితే ఏపీలో ఈ స్కామ్ ఎన్నో రెట్లు అధికంగా జరిగిందని మంత్రికి లావు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఆయన హోంమంత్రికి అందజేశారు. రూ.90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని లావు సంచలన ఆరోపణలు చేశారు. వీటిపైనే హోం మంత్రి ఆరా తీశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఎన్.సునీల్ రెడ్డి దుబాయ్కు చెందిన రూ.2 వేల కోట్లను తరలించినట్టుగా ధృవీకరించే కీలక పత్రాలను ఈ సందర్భంగా అమిత్ షాకు ఎంపీ అందించారు. ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిపిస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ కుంభకోణం కారణంగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారని లావు ఈ సందర్భంగా వివరించారు.