శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:10 IST)

డబ్బు కోసమే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారా.. ఎవరు?

కడపజిల్లాలో వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీగా మారింది. ఇప్పటికే వివేకానందరెడ్డి పిఏ క్రిష్ణారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్యాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. పోస్టుమార్టంలో కూడా వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. ఏడుచోట్ల అతి దారుణంగా నరికి చంపినట్లు ఆనవాళ్ళను పోలీసులు గుర్తించారు. కసితీరా వివేకానందరెడ్డిని చంపినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ పని చేశారన్న కోణంలో పోలీసులు వేగంగా పావులు కదుపుతున్నారు.
 
దివంగతనేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి స్వయానా తమ్ముడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ కావడంతో ఈ కేసు సవాల్‌గా తీసుకుని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు. డబ్బు కోసమే పనిమనిషి హత్య చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పనిమనిషిగా ఉన్న వ్యక్తి పరారీలో ఉండటంతో పోలీసులు సి.సి. ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
 
సి.సి.టివి ఫుటేజ్‌ను ఎస్పీ రాహుల్ స్వయంగా పరిశీలించి పనిమనిషి పనే ఇదంతా అన్న నిర్ణయానికి వచ్చారట. పని మనిషి వివరాలను ప్రస్తుతం సేకరిస్తున్నారు. త్వరలో అతన్ని పట్టుకుని మీడియా ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది.