మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (11:50 IST)

రక్తపు మడుగులో వైఎస్ వివేకా మృతదేహం.. తలకు బలమైన గాయం....

గుండెపోటుతో మరణించినట్టు చెబుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి శుక్రవారం వేకువజామున పులివెందులలోని తన ఇంటి బాత్ రూమ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 
 
వివేకా మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని చెప్పిన ఆయన, తలకు, చేతికి బలమైన గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ప్రజల మధ్య ఎంతో ఉత్సాహంగా కలియదిరుగుతూ కనిపించిన వివేకా... శుక్రవారం తెల్లవారుజామున బాత్రూమ్‌కెళ్ళి విగతజీవిగా కనిపించడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా, ఆయన పడివున్న ప్రాంతంలో రక్తపు మరకలు కనిపించడంతో, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. 
 
అయితే, బాత్రూమ్‌లో ఆయన కాలుజారి పడివుండవచ్చని, ఆ సమయంలో తలకు దెబ్బ తగిలివుండవచ్చని భావిస్తున్నా, పోలీసులు మాత్రం ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేశారు. 
 
పోలీసులు వచ్చేసరికే ఆయన ఇల్లు బంధువులు, కార్యకర్తలతో నిండిపోవడంతో డాగ్ స్క్వాడ్ వల్ల ఉపయోగమేమీ ఉండక పోవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వివేకా మృతదేహానికి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశాన్ని పరిశీలిస్తామని కడప ఎస్పీ వెల్లడించారు. 
 
కాగా, ఇటీవల వివేకాకు గుండెపోటు రాగా, ఆయన స్టెంట్ వేయించుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన రక్తపోటుతోనూ బాధపడుతున్నారు. 68 ఏళ్ల వయసున్న ఆయన, పైకి కనిపించేంత ఆరోగ్యంగా ఏమీ లేరని అభిమానులు అంటున్నారు.