గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (14:06 IST)

జనసైనికులను చూస్తేనే వణికిపోతున్న పేర్ని నాని.. ఎందుకు తెలుసా?

వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానికి భయం పట్టుకుంది. ముఖ్యగా, జనసైనికులను చూసినా, వారి పేరెత్తినా భయంతో వణికిపోతున్నారు. తాజాగా పేర్ని నానిపై కొందరు జనసైనికులు కోడిగుడ్లతో దాడి చేశారు. మరికొందరు ఆయన కారును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదివారం గుడివాడలోని తోట శివాజీ ఇంటికి మాజీ మంత్రి పేర్ని నాని వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు. తోట శివాజీ ఇంటి ముందు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసైనికులు పేర్ని నానిపై ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనతో ఆయన షాక్‌కు గురయ్యారు. మరికొందరు పేర్ని నాని కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో నాని కారు అద్దాలు పగిలాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు జనసైనికులను అదుపు చేశారు. ఈ క్రమంలో జనసైనికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
 
మరోవైపు ఘర్షణ సందర్భంగా పేర్ని నానికి జనసైనికులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్‌కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు రావడం సిగ్గుచేటన్నారు. గతంలో రెండు చెప్పులతో పవన్‌ను పేర్ని నాని అవమానించారని... ఇప్పుడు 36 చెప్పులు రెడీగా ఉన్నా అన్నారు. ఈ క్రమంలో, అక్కడి నుంచి పోలీసుల అండతో పేర్ని నాని వెళ్లిపోయారు.