శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (16:00 IST)

కూల్చివేతలతో పాలన ప్రారంభం.. అందుకే రాష్ట్రంలో అంధకారం : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కరెంట్ కోతలను అమలు చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తలతిక్క పనులు చేయడం వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం వరుస ట్వీట్లు సంధించారు. 
 
ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
 
ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?
 
2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు. 
 
ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 2019 సెప్టెంబరు నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమే.
 
ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడుల మీద ఒప్పందాలు, కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్లని రోడ్లు మీదకి తీసుకురావటం, కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం... మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?