1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (11:15 IST)

గాలి కుమార్తె పెళ్లికి వెళ్ళొద్దు.. బీజేపీ నేతలకు అమిత్ షా ఆదేశాలు

కర్నాటక మాజీ మంత్రి, బీజీపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి బీజేపీ నేతలెవ్వరూ వెళ్లొద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ పెళ్లికి బీజేపీ నేతలంతా

కర్నాటక మాజీ మంత్రి, బీజీపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి బీజేపీ నేతలెవ్వరూ వెళ్లొద్దని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ పెళ్లికి బీజేపీ నేతలంతా దూరంగా ఉండనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వెళితే, వివాదాలు, విమర్శలు చుట్టుముట్టవచ్చని అందువల్ల పెళ్లికి ఎవరూ వెళ్లొద్దని అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది. 
 
నిజానికి దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు విపక్ష నేతలంతా ప్రధాని మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి వెళితే తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని అమిత్ షా, స్వయంగా యడ్యూరప్పకు ఫోన్ చేసి చెప్పారని, ఇప్పటికే ఈ పెళ్లికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు వెనక్కు తగ్గవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పెళ్లికి నేతలు హాజరైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అమిత్ షా చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, బ్రాహ్మణి వివాహ వేడుకలు, బెంగుళూరులోని ప్యాలెస్ మైదానంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.