1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Janasena Janavani in Vijayawada

నేడు విజయవాడలో జనసేన పార్టీ జనవాణి

janasena
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జనవాణి కార్యక్రమం జరుగనుంది. సామాన్యుడి ఘోషను వినేందుకు వీలుగా జనవాణి పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. 
 
ఇదే విషయంపై ఆ పార్టీ పీఏసే ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైకాపా ప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడప కార్యక్రమం ఒట్టి బూటకమన్నారు. రాష్ట్రంలో ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. అందుకే, తమ పార్టీ అధ్వర్యంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
తొలి జనవాణి కార్యక్రమాన్ని మూడో తేదీన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఆ తర్వాత వాటిని సంబంధిత విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జనసేన పార్టీ తరపున ఆరా తీస్తారని తెలిపారు. 
 
విజయవాడలో ఈ నెల 10న కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నెల 12 నంచి తమ కార్యకర్తలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారని తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నుపుర్ శర్మకు లుక్‌ ఔట్ నోటీసులు జారీ