మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 నవంబరు 2018 (21:50 IST)

వచ్చే ఏడాది రోడ్డుపైకి కియా కారు... స్థానికులకే ఉద్యోగాలు

పెనుగొండ : అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని కియా కంపెనీ కారు వచ్చే ఏడాది ఆరంభంలో రోడ్డుపైకి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మంత్రి కియా కంపెనీ ప్రాంగణంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రికి కియా మోటర్స్ ఇండియా ఎండి హ్యూన్ కుక్ షిన్ కంపెనీలో జరుగుతున్న పనులను వివరించారు. కంపెనీలో శరవేగంగా సాగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. కియాలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. 
 
ప్రతి ఒక్కరూ కంపెనీ అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కియా కంపెనీ కారు రోడ్డుపైకి వస్తుందని, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారును ప్రారంభిస్తారని తెలిపారు. కియా కంపెనీ ఏపికి రప్పించడానికి ముఖ్యమంత్రి తీవ్రంగా శ్రమించారని తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు పోటీపడినప్పటికీ ముఖ్యమంత్రి తన అనుభవంతో కియాను ఏపికి రప్పించాన్నారు. కియా యాజమాన్యం చెప్పినట్లుగానే పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. 
 
కియా ఉద్యోగాల భర్తీలో స్థానికులకే పెద్దపీట వేస్తామన్నారు. భవిష్యత్తులో అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లా అంటే ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని, ఇక్కడ నిరుద్యోగ సమస్య, కరువును తరిమేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో వోక్స్ వోగన్ లాంటి ప్రపంచ స్థాయి కార్ల కంపెనీ ఏపిలో యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినా.. అప్పటి ప్రభుత్వ అవినీతి కారణంగా వ్యాక్స్ వోగన్ పక్క రాష్ట్రానికి తరలిపోయిందని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. 
 
పరిశ్రమల రాకతోనే యువతకు ఉపాధి, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు పారిశ్రామిక అభివృద్ధి విధానం (ఐడిపి) క్రింద రాయితీలు ప్రకటించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బుధవారమే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ. 2812 కోట్ల రాయితీలను విడుదల చేశామని మంత్రి చెప్పారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆర్ ప్రీతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు ఉన్నారు.