1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (10:02 IST)

విగ్గుతో అమ్మాయిలకు వల.. ఆపై లైంగిక వేధింపులు...

ఓ యువకుడు విగ్గుతో అమ్మాయిలకు వల వేసి.. ఆ తర్వాత వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తూ బంగారం, డబ్బు గుంజుకుంటున్న పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. పైగా, ఇతనికి వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాగే, 12 రాష్ట్రాల్లో వివిధ రకాల కేసులు కూడా నమోదైవుండటం గమనార్హం. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా పడిగ్యాలకు చెందిన రాజ్‌కుమార్ గత కొంతకాలంగా రాజుపాళెంలో ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. 
 
అయితే, తన పాఠశాలలో ఓ యువతి ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమెపై కన్నేసిన రాజ్ కుమార్.. ఆమెను ఇటీవల కిడ్నాప్ చేసి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు తరలించి ఓ ఇంటిలో నిర్భంధించాడు. అయితే, తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ క్రమంలో రాజ్‌కుమార్ చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి విచారించగా, అతని బండారం బయటపడింది. 
 
ముఖ్యంగా, తలకు విగ్గుపెట్టుకుని అందమైన అమ్మాయిలా తయారై, ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ, వారిని తన వలలో పడేలా చేసుకునేవాడు. ఆ తర్వాత వారి ఫోటోలు తీసుకుని, వాటిని మార్ఫింగ్ చేసి, వాటిని చూపించి బెదిరించి డబ్బు, నగలు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇలా కొన్నేళ్లుగా మోసాలకు పాల్పడుతుండటంతో అతనిపై ఏకంగా 12 రాష్ట్రాల్లో వివిధ రకాల కేసులు నమోదైవున్నట్టు తేలింది.