1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (09:44 IST)

మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్

ఫిజియోథెర‌పీ డాక్ట‌ర్ గా ప‌రిచ‌యం అయి, ఫిటింగ్ పెట్టేసింది ఆ కిలాడి. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండ‌లం ఇప్పటం గ్రామాంలో నివాసం ఉంటూ, మిలటరీలో పనిచేస్తున్న ఓ వ్య‌క్తికి కుచ్చు టోపీ పెట్టింది. 
 
 
మిల‌ట‌రీ వ్య‌క్తి కార్తీక్ అనే వ్యక్తి త‌న ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేక పోవడంతో కొంత కాలం నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఫిజియోథెరపీ డాక్టర్ పేరుతో పరిచయమై, తన భార్యకు వైద్య సేవలు అందిస్తూ గత కొంత కాలంగా వారికి, వారి పిల్లలకు దగ్గరైంది.
 
 
పెద్ద హాస్పిటల్ పెట్టబోతున్నాం... కోటిన్నర లోను వస్తందని, చెప్పడంతో ఆమెను నమ్మిన కార్తీక్ దాదాపు 60 లక్షల వరకు నగదు, పది లక్షల వరకు బంగారం ఇచ్చేశాడు. అంతే కాదు త‌న సొంత ఇంటి కాయితాలు కూడా తాకట్టు పెట్టించింది ఆ కిలాడి.  
 
 
ఆ మహిళ మంగళగిరిలో "రోజా హాస్పిటల్స్" పేరుతో హాస్పిటల్ కూడా నిర్వహిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తూ, సాక్షాత్తూ మిలటరీ కుటుంబాన్ని మోసం చేయడం ఇపుడు సంచలనంగా మారింది. కార్తీక్ కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడమే కాక, ఇంటి కాగితాలు తాకట్టు పెట్టించింది. చివరకు నాకేం తెలియదు అనడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. 
 
 
తీరా చూస్తే, ఆ కిలాడి పెదకాకాని ఎస్.ఐ వినోద్ కుమార్ తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉండి,  గత సంవత్సరం పెళ్లి కూడా చేసుకుంది. అక్కడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కార్తీక్ కుటుంబానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, అప్పులు చేస్తే ఇవ్వాల్సిన రూలేమీ లేదంటూ... మీకు చేతనైనది చేసుకోండి అంటూ ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడటంతో బాధితులు దిక్కులేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. 

 
సంపాదించినదంతా పోవడంతో ఆ కుటుంబం మాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మిలటరీ లో సేవలందించి దాచుకున్న డబ్బు మహిళ కాజేయటంతో పాటు ఎస్సై వినోద్ కుమార్ నుంచి బెదిరింపులు రావడంతో దిక్కుతోచని స్థితిలో కార్తీక్ కుటుంబం ఉంది. పెళ్ళికి ముందే ప్రేమలో ఉంటూనే, ఎస్పై వినోద్ కుమార్ ఆమెతో కలసి మోసానికి పాల్పడినట్లు బాదితులు ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్న‌తాధికారులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.