1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జూన్ 2024 (11:13 IST)

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్.. మెగా డీఎస్పీపై తొలి సంతకం..

nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను క్యాబినెట్‌ ముందు పెట్టే ఫైల్‌పై ఆయన సంతకం పెట్టారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. 
 
బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. 
 
మరోవైపు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వేదపండితుల వెంట లోకేశ్ సచివాలయంలోని తన ఛాంబర్ కు వెళ్లడం, బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఏపీని ఐటీ రంగంలో అభివృద్ధిపథంలో నడిపిస్తావనే నమ్మకం తనకుందని భువనేశ్వరి చెప్పారు. ఐదేళ్ల పదవీకాలం విజయవంతం కావాలని, రాష్ట్రం పురోభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి లోకేశ్ సామర్థ్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు ట్విట్టరులో పేర్కొన్నారు.