1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (13:57 IST)

మహిళా వ‌లంటీరుపై నోరుపారేసుకున్న నరసరావుపేట కమిష‌న‌ర్

వ‌లంటీరుకు కుటుంబం ఉండ‌దా? ప‌నులుండ‌వా? వార్డు వ‌లంటీరు అంటే క‌ట్టు బానిసా?వ‌లంటీర్ల‌కు నిర్ధేశిత పని గంటలు ఏవీ లేక పోయినప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో ఉండాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు వార్డు అడ్మిన్లు.
 
ప్ర‌భుత్వ ఉద్యోగులు, స‌చివాలయ సిబ్బంది, వాళ్ళు చేయవలసిన పనులను కూడా తమతో చేయిస్తున్నారంటూ వాపోతున్నారు వ‌లంటీర్లు. ముఖ్యంగా మ‌హిళా వ‌లంటీర్ల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా ఉంది. దీనికి ఉదాహ‌ర‌ణ ఈ అధికారి చీవాట్లు, నోరుపారేసుకోవ‌డ‌మే.
 
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళా వాలెంటీరుపై క‌మిష‌న‌ర్ రామచంద్రారెడ్డి నోరుపారేసుకున్నారు. ఇలా దురుసుగా ప్రవర్తించారు. షేక్ అక్త‌ర్ అనే మహిళ న‌ర‌స‌రావుపేట మూడో వార్డులో వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. అక్కడి అడ్మిన్‌గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమిష‌న‌ర్ తనకు ఫోను చేసి అసభ్యంగా మాట్లాడారని షేక్ అక్త‌ర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తోంద‌ని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో 3 వ వార్డు వాలెంటీర్లు అందరూ అడ్మిన్ పైన కమిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

పైగా ఆ కక్ష‌ను మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె తెలియజేశారు. వార్డు అడ్మిన్ చెప్పారని కమిష‌న‌ర్ రామ చంద్రారెడ్డి తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ, నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ, బొక్కలో వేసి తోలు వలిపిస్తా! అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యంగా మాట్లాడిన కమిష‌న‌ర్ రామచంద్రారెడ్డిపై, వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకొవాలని ఆమె వేడుకున్నారు.