1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (14:22 IST)

భర్త తుదిశ్వాస విడిచిన నాలుగు గంటల్లో భార్య మృతి

husband and wife
నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో ఓ విషాదకర సంఘటన జరిగింది. భర్త తుదిశ్వాస విడిచిన కేవలం నాలుగు గంటల్లోనే భార్య కూడా కన్నుమూసింది. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మండలంలోని నరుకూరులో ఈ విషాదకర ఘటన బుధవారం జరిగింది.
 
నరుకూరుకు చెందిన రమణ (40), సుమలత (36) అనే దంపతులు జీవిస్తున్నారు. డ్యాన్సర్‌గా రమణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్థానికుల మన్ననలు పొందారు. 
 
కొద్ది రోజుల క్రితం దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వారం రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. భర్త చికిత్స పొందుతున్న సమయంలో సుమలత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 
 
మంగళవారం రమణను చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. నరుకూరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించిన నాలుగు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమలత మరణించింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.