1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (11:25 IST)

జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్‌ల పిచ్చి : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్యాలెస్‌లు కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయనకు ప్యాలెస్‌ల పిచ్చి పట్టుకుందని ఆయన ఆరోపించారు. ఇటీవల విశాఖపట్టణం చేపల హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పడవలు కాలిపోయిన జాలర్లకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను రూ.50 వేలు చొప్పున అందజేశారు. 
 
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నేనిచ్చే సొమ్ముతో బాధితులకు కష్టాలు తీరిపోతాయని నేను నమ్మను. కానీ, మీకు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనసేన పార్టీ ఉంది. మా నేతలు ఉన్నారు. మా వీర మహిళలు ఉన్నారు. మా జనసైనికులు ఉన్నారు. సాటి మనిషిని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. గతంలో కౌలు రైతులకు కూడా ఇలా సాయం చేశాను. ఈ రోజు దాదాపు 30 లక్షల రూపాయలను అందజేస్తున్నాను.
 
అలాగే, ఈ సాయం ఇస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేస్తారన్న ఉద్దేశ్యంతో ఇక్కడు నేను రాలేదు. నిజంగా నేను అలాంటి వ్యక్తినికాదు. మీరు కష్టంలో ఉన్నపుడు నేను అండగా ఉంటాను. ఓ వైపు, తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. తెలంగాణాలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. ఆ కార్యక్రమాలు ఆపుకుని ఇక్కడు ఎందుకు వచ్చానంటే.. మీ కష్టాన్ని నా కష్టంగా భావించిబట్టే" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
ఈ వైకాపా నేతలకు ఓట్లు కావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు పట్టించుకోరు. వైకాపా అధికారంలోకి వచ్చాక వైజాగ్‌ను సర్వనాశనం చేశారు. మరోమారు వారు అధికారంలోకి వస్తే ఏమీ మిగలదు. ఆకాశం మినహా. రుషికొండకు బోడిగుండు కొట్టించారు. పర్యాటక భవనాల ముసుగులో రూ.456 కోట్ల ప్రజాధనంతో ఈ జగన్ రెడ్డి ప్యాలెస్‌లు కట్టించుకున్నారు. ఈయనకు ఎన్ని ప్యాలెస్‌లు కావాలి. ఆయనకు ప్యాలెస్‌ల పిచ్చి పట్టుకుంది" అని ఆరోపించారు.