1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం : నిర్మాత ఆదిశేషగిరిరావు

adiseshagiri rao
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం దారుణమని సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూశానని, వారి మధ్య ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు, చర్యలు లేశమాత్రం కూడా లేవన్నారు. జగన్ పాలనలోనే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చూస్తున్నామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం అత్యంత దారుణమన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం కూడా ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఏమాత్రం మంచిది కాదని అన్నారు. 
 
మరోవైపు, చంద్రబాబు గత పది రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంజి ఆయన భార్య భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు జైలుకు కిలో మీటర్ దూరంలోని ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేస్తున్నారు. భువనేశ్వరి అక్కడే ఉండి తన భర్తకు కావాల్సి ఆహారాన్ని జైలుకు పంపిస్తున్నారు. 
 
ఇక సామాన్యుల పరిస్థితేంటి: విశాల్ ఆవేదన 
 
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి ఒక విజనరీ లీడర్‌ను అరెస్టు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని హీరో విశాల్ ప్రశ్నించారు. ఆయన నటించిన తాజా చిత్రం "మార్క్ ఆంటోనీ". ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుకలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఇందులో పాల్గొన్న విశాల్.. చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు గొప్ప నాయకుడన్నారు. అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు 
 
చంద్రబాబు పరిస్థితిని చూస్తే నాకే భయం వేస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీగల నేత అని కొనియాడారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు బాధాకరమని, ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. 
 
కాగా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించిన విషయం తెల్సిందే. తన మిత్రుడు గొప్ప పోరాటయోధుడని, ఆయన ఎలాంటి తప్పు చేయరని అన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. చంద్రబాబును ములాఖత్‌లో కలవాలని అనుకున్నానని, కానీ కుటుంబ ఫంక్షన్ కారణంగా కలుసుకోలేక పోయినట్టు చెప్పిన విషయం తెల్సిందే.