1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (14:32 IST)

తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎర్రచందనం దుంగల‌ స్వాధీనం

తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వినాయకుని ఆలయం వద్ద ఆరవ కల్వర్టు పడమర వైపున స్మగ్లర్లు నుంచి 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ నాయకత్వంలో  ఆర్ ఎస్ ఐ లు వినోద్ కుమార్, విశ్వనాథ్ బృందం రాత్రి తిరుమల ఘాట్ రోడ్డు పరిధిలో కూంబింగ్ నిర్వ‌హించారు.  
 
 
కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడవేసి కేకలు వేస్తూ చీకటిలో కలిసి పోయారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలు లభించాయి.


ఎస్పీ సుందరరావు మాట్లాడుతూ ఈ దుంగలు 699 కిలోలు ఉన్నాయని, విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. ఈ కేసును సిఐ వెంకట రవి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఎస్ ఐ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.