1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (13:33 IST)

ఏపీలో నేటి నుంచి 'జగనన్నే మా భవిష్యత్'... ఇంటింటికీ జగనన్న స్టిక్కర్లు

maa jagananna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కింది స్థాయి పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం సిద్ధమైంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ అనే ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా, ప్రతి ఇంటి గోడకు జగనన్నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లను అంటిస్తారు. వీటిని గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికి వెళ్లి అంటిస్తారు. 
 
ఈ పథకం గురించి ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఇందులో పార్టీ గృహ సారథులతో పాటు సచివాలయ కన్వీనర్లు ప్రతి గడపకు వెళతారన్నారు. కోటి 60 లక్షల ఇళ్ళకు వెల్లి 5 కోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తారని తెలిపారు. "మమ్మల్ని మా జగనన్న పంపారు. ఆయన తరపున మీ మద్దతు కోరుతున్నాం. మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాం" అని ప్రజలతో మాట్లాడతారని చెప్పారు. అలాగే, జగన్ ఇచ్చిన సందేశాన్ని కూడా ఆ కుటుంబానికి వివరిస్తారని తెలిపారు. 
 
ఈ ప్రచార కార్యక్రమంలో ఏడు లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగే సాహసం జగన్ నాయకత్వంలోని వైకాపా మాత్రమే చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా, మీకు అభ్యంతరం లేకపోతే సీఎం జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్‌ను మీ ఇంటికి తలపుకు అంటిస్తామని గృహసారథులు ఆయా కుటుంబాలను కోరుతారు. దాంతోపాటే ఫోన్‌ను అంటింే స్టిక్కరును కూడా ఇస్తారు అని చెప్పారు. ఇదంతా కూడా స్వచ్ఛందంగానే జరుగుతుందని సజ్జల తెలిపారు.