ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (14:25 IST)

అధికార, ధన, కండబలాన్ని ఉపయోగించి నా భార్యను లోబరుచుకున్నారు.. రాష్ట్రపతికి మదన్ మోహన్ ఫిర్యాదు

madan mohan
గత వైకాపా ప్రభుత్వంలో అధికార, ధన, కండ బలాన్ని ఉపయోగించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ప్రభుత్వ మాజీ అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డిలు తన భార్యను లోబరుచుకుని, ఓ బిడ్డకు జన్మనిచ్చారని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఫిర్యాదు చేశారు. గత రెండు మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాంవేసివున్న ఆయన.. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్‌లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్ రెడ్డి తమ అధికార, ధన, కండబలాన్ని ఉపయోగించి తన భార్యను లోబరుచుకొని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపిస్తూ నాలుగు పేజీల లేఖను వారికి పంపారు.
 
తన భార్యతో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఎస్టీగా తన హక్కులను హరించారని మదన్ మోహన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన వైవాహిక జీవితాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా తన హక్కులను హరించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
 
వారి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని, తన భార్య శాంతి కూడా తనను బెదిరిస్తోందని మదన్ ఆరోపించారు. ఆమెకు బ్యూరోక్రాట్లతోపాటు అసాంఘిక శక్తులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్య, విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి ముగ్గురూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటున్నారని, కాబట్టి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఉందని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని మదన్మోహన్ ఆ లేఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆయన కోరారు.