1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (17:10 IST)

అచ్చెన్నాయుడి మైక్‌ కట్ చేసిన సభాపతి.. మంత్రి అయితే వ్యక్తిగత విమర్శలా : కోడెల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కె అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా సభాపతి స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ మైక్ కట్ చేశారు. మంత్రిగా స్థానంలో ఉంటూ సభలో వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఈ సంఘటన గురువారం శాసనసభలో జరిగింది. 
 
ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం కరవుపై చర్చలో భాగంగా విపక్ష నేత జగన్ మాట్లాడుతూ, పట్టిసీమ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీన్ని అధికార పక్ష సభ్యులు అడ్డుకోగా, స్పీకర్ కల్పించుకుని, చర్చను కరవుకు మాత్రమే పరిమితం చేయాలని, మరే ఇతర అంశాన్నీ ప్రస్తావించేందుకు అంగీకరించబోనని స్పష్టం చేశారు. 
 
ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని కోరగా, మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. అచ్చెన్నాయుడు వెంటనే వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైఎస్ చనిపోయిన తర్వాత, వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైఎస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఆయనింకా విమర్శలు గుప్పిస్తుండగానే కోడెల మైక్ కట్ చేశారు. సాధారణంగా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. దీంతో ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.