1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (11:46 IST)

బ్రహ్మంగారి మఠం మఠాధిపతి నియామకం...వంశాచారం అదే!

కాల‌జ్ణాని శ్రీ పోతులూరి వీరబ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠం సంప్ర‌దాయాల‌ను గౌర‌వించాల‌ని బ్ర‌హం గారి భ‌క్తులు కోర‌తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం అర్హతలు ఉన్న వెంకటాద్రి స్వామి వారికి మద్దతు ఇవ్వాల‌ని కోరుతున్నారు.
 
 
1987లో దేవాదాయ శాఖ చట్టం ఏర్పాటయింది. ఆ ప్రకారం మొదటగా అక్కడి సంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారం తదుపరి మఠాధిపతి నిర్ణయం జరుగుతుంది. ఆ సంప్రదాయం లేనప్పుడు తదుపరి మఠాధిపతిని నామినేషన్ చేసే పద్ధతి ఉంటుంది. మఠాధిపతి నామినేషన్ చేయటం అంటే ఉత్తరాధికారి (తదుపరి మఠాధిపతి)ని ఎంపిక చేసి ప్రభుత్వానికి నామినేషన్ పంపి, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా పొందవలసి ఉంటుంది. అలా చేయని పక్షంలో అక్కడి సంప్రదాయం గౌరవిస్తూ, ఇదే సంప్రదాయం ఉన్న ఇతర మఠాధిపతులు శిష్యుల అభిప్రాయం మేరకు తదుపరి మఠాధిపతి నియామకం జరుగుతుంది. 
 

దివంగత మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి గతంలో తమ తండ్రి వీలునామా రాస్తే, లేదా నామినేషన్ చేస్తే తదుపరి మఠాధిపతి అవలేదు. గతంలో ఎప్పుడూ బ్రహ్మంగారి మఠంలో ఈ పద్దతి లేదు. ప్రధమ కుమారుడు మఠాధిపతి అవటం ఇక్కడ సంప్రదాయం.‌ మొత్తం 11 మంది మఠాధిపతులలో 8 పర్యాయాలు ప్రథమ కుమారుడు మఠాధిపతి అయ్యారు. సంతానం లేనప్పుడు లేదా అనారోగ్యంతో మరణించడం వలన మాత్రమే మూడు సార్లు సోదరులు మఠాధిపతి అయ్యారు.

 
ఇక్కడి ఆచార వ్యవహారాల ప్రకారం సతీసమేతంగా కళ్యాణం హోమం వగైరా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది. హిందూ మత సంప్రదాయం అనుసరించి ఆ సంప్రదాయాలకు విలువ ఇస్తూ దేవాదాయ చట్టంలో కూడా ఆమోదించారు. మహిళలకు విలువలేదు అనటం తప్పు. ఇతర మఠాలు అన్నింటిలోనూ సన్యాస సంప్రదాయం. మహిళలకు ప్రాధాన్యం ఉండదు కానీ, బ్రహ్మంగారి మఠంలో మఠాధిపతి తో పాటు వారి సతీమణి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయం. బ్రహ్మంగారి మఠంలో రాజయోగ గృహస్థ ధర్మ సంప్రదాయం అమ‌లులో ఉంది. 
 

ఇతర మఠాలలో ఉత్తరాధికారి నియామకం ఉంటుంది. అంటే మఠాధిపతి తాను జీవించి ఉన్నప్పుడే తన శిష్యులలో అర్హులైన సమర్థులైన ఒకరిని ఎంపిక చేసి ఉత్తరాధికారి గా నియమిస్తారు. తన మరణం తరువాత ఉత్తరాధికారి తదుపరి మఠాధిపతి అవుతారు. దాదాపు 50 సంవత్సరాల సుధీర్ఘ అనుభవం ఉన్న దివంగత మఠాధిపతికి చట్టంపై అవగాహన లేదు, ఈ పద్ధతి తెలియదు అనుకోవటం అమాయకత్వం. వారు తమ తండ్రి మరణించాక ప్రథమ కుమారుడు అనే కారణంతో మఠాధిపతి బాధ్యతలు చేపట్టి తమ తర్వాత తదుపరి మఠాధిపతి మాత్రం నామినేషన్ ద్వారా అనే పద్దతి ఆచరించడం కరెక్ట్ కాదు అని భావించే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు.  వారు కేవలం ఒక వీలునామా మాత్రమే రాసివుంటే విలువ ఉండేది. మనం కూడా విలువ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దృష్టిలో నాలుగు వీలునామాలు బహిరంగం అయ్యాయి. అవి కూడా అనుమానాస్పదం అని నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు అని
ప్రభుత్వం వ్రాతపూర్వకంగా తెలియజేసింది. 

 
వాస్తవానికి బహిరంగం అయిన వీలునామాలలో నామినేషన్ రాసే పద్దతులు ఏవి పాటించినట్లు లేదు. వారు నామినేషన్ చేసే వ్యక్తి ఫలానా అర్హతలు ఉన్నాయి అని మాత్రమే రాసి ప్రభుత్వానికి పంపవలసి ఉంటుంది. తదుపరి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా తెప్పించుకోవాలని ఉంటుంది. ఇవేవీ జరగలేదు. ఇవన్నీ గమనిస్తే ఆ వీలునామాలు వారు స్వయంగా రాసినవేనా? అనే అనుమానం మనకి కూడా రావటంలో తప్పు లేదు. 
 

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులు భక్తులు ఈ అంశాలు అన్నీ పరిశీలించి అర్థం చేసుకుని మఠం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి మఠం సంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం అర్హతలు ఉన్న వెంకటాద్రి స్వామి వారికి మద్దతు ఇచ్చి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రతిష్టను కాపాడుకునేందుకు అడుగులు వేయయాల‌ని భ‌క్తులు కోరుతున్నారు.