శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:57 IST)

రాజధాని తరలింపా? ఏపీ విభజన చట్టంలో మార్పులు చేయాలి?

నవ్యాంధ్ర రాజధానిని మరో ప్రాంతానికి తరలించడం అనేది అసాధ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఖచ్చితంగా రాజధానిని తరలించాల్సివస్తే కేంద్రం కల్పించుకుని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేయాల్సివుంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఎం. రామకృష్ణ అంటున్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, దాన్నికూడా లెజిస్లేచర్, జ్యూడిషియల్ క్యాపిటల్ అని ఎక్కడా పిలవరని... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలనే పిలుస్తారని తెలిపారు. 
 
అయితే, ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారని... అయితే చట్టంలో ఎక్కడా రిలోకేషన్ అని అనలేదని చెప్పుకొచ్చారు. వైజాగ్‌లో రాజధాని ఉండాలి అంటే అమరావతి నుంచి రీలోకేట్ చేయాలని తెలిపారు. రాజధాని తరలింపు అని చెప్పకుండా రాష్ట్ర పరిధిలో లేని అంశాలను ఈ చట్టంలో పెట్టారని ఆయన చెప్పారు.
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకే చోట పెట్టమని 94(3)లో షల్ ప్రొవిడ్ అని ఉందని తెలిపారు. చట్టంలో అన్నీ కూడా ఒకేచోట ఉండాలని చెప్పారన్నారు. జ్యూడీషియల్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌లను వేరు చేయడానికి విభజన చట్టం అంగీకరించదని తేల్చిచెప్పారు. 
 
ఎక్కడ నుండి పరిపాలన సాగించాలి అనేది ఆర్టికల్ 4లో స్పష్టంగా ఉందని చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిపాలన వికేంద్రీకరణ చట్టంలో కూడా అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. రాజధానిని తరలింపు చేయాలంటే కేంద్రం మరోసారి విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.