1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (20:53 IST)

గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? అమరావతిని వల్లకాడు చేసేందుకు..?: అనురాధ

వైసీపీ ప్రభుత్వంలో 28మంది ఎంపీలు ఉన్నారు.. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన వారు ఏం చేస్తున్నారు.. గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? అని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. అమరావతిని వల్లకాడు చేసేందుకు సీఎం జగన్ అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి అంతర్జాతీయ కంపెనీలను తరలించారని దుయ్యబట్టారు.
 
లోపాయికారి ఒప్పందాలతో జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేశారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. శనివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం గురించి వైసీపీ మాట్లాడితే జనం నవ్వుతారని ఎద్దేవా చేశారు. విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రత్యేక హోదాను అటకెక్కించారన్నారు. ఏపీకి హోదా పేరుతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ.14 వేల కోట్లు తెచ్చారని గుర్తుచేశారు. రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేయడమేనా ప్రజా సంక్షేమమంటే? అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు.
 
అమ్మఒడి పేరుతో జగన్ అమ్మలందరినీ మోసం చేశారని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిదని దుయ్యబట్టారు. రూ.3 వేల పెన్షన్ ఇవ్వకుండా మోసం చేశారని పంచుమర్తి అనురాధ చెప్పారు. 
 
పేదవారికి రూ.5కే భోజనం పెట్టే అన్నాక్యాంటీన్లను మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఆపేశారన్నారు. రుణమాఫీ తీసేయడమేనా ప్రజా సంక్షేమమంటే?అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు ఉపాధినిచ్చిన పథకాన్ని నిలిపేవేశారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.