శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (12:47 IST)

కాపురంలో కలహాలు : అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు... భార్యపై కూడా...

తెలంగాణ రాష్ట్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాలవల్లిలో దారుణం జరిగింది. కాపురంలో కలహాల కారణంగా అత్తను ఓ అల్లుడు గొడ్డలితో నరికి చంపేశాడు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో అత్త ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపూర్‌ గ్రామానికి చెందిన ఒన్నాల లక్ష్మి, సుజాత అనే మహిళలు తల్లీకూతుళ్లు. అయితే కాపురంలో చెలరేగిన మనస్పర్థల కారణంగా తీవ్ర ఆగ్రహానికిగురైన అల్లుడు అత్తను గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 
 
తల్లిపై భర్త చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు సుజాత ప్రయత్నించడంతో ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుజాత పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తూ, తీవ్రంగా గాయపడిన సుజాతను ఆస్పత్రికి తరలించారు.