1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:48 IST)

బావిలో తోసేసి.. ఎముకలు విరిగాక.. కొనవూపిరితో వున్నప్పుడు అత్యాచారం చేసేవాడు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస హత్యలకు పాల్పడిన సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి హత్యోదంతం తర్వాత.. మనీషా అనే యువతి అదే బావిలో హత్యకు గురై ఎముకలు మాత్రమే మిగిలి వున్న స్థితిలో కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 
 
ఈ రెండు హత్యలను హజీపూర్‌లో వుండే శ్రీనివాస్ రెడ్డి అనే సైకో చేసినట్లు పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల ఆధారంగా అతనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో షాకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి.  
 
డ్రగ్స్‌‌కు అలవాటు పడిన శ్రీనివాస్‌ రెడ్డిపై గతంలోనూ అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఒంటరిగా ఉన్న మహిళలు, బాలికలను టార్గెట్ చేసుకుని వారిపై అత్యాచారాలకు పాల్పడే ఈ సైకో ఆపై హత్య కూడా చేసేవాడని చెప్పారు. హాజీపూర్‌ వెళ్లడానికి ఎదురుచూసే వారిని తన వాహనంపై ఎక్కించుకుని, బావి వద్దకు తెచ్చి హత్యలకు పాల్పడుతుంటాడు.
 
తొలుత వారిని బావిలోకి బలవంతంగా తోసేసి.. బావిలో పడిన తర్వాత వారి ఎముకలు విరిగి కొనవూపిరితో వుండగా.. అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసేవాడని పోలీసులు తెలిపారు. చివరికి హత్య చేసిన వారిని అదే బావిలో పూడ్చి పెట్టేవాడని పోలీసులు తెలిపారు. 
 
మూడు సంవత్సరాల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయి, తిరిగి ఏడాది క్రితం వచ్చాడు. గత వారంలో శ్రావణి హత్యోదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె మృతదేహాన్ని బావిలోంచి తీస్తున్నప్పుడు, అక్కడున్న ప్రజల్లో శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్నాడు.
 
ఇదే బావిలో మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు బావిలో తవ్వకాలు జరపాలని భావిస్తున్నారు. ఇక కల్పన అనే బాలిక కేసులో కూడా శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం వుందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.