ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (19:48 IST)

భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం: ఏపీ చీఫ్ జస్టిస్

భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేందర్ కుమార్ మహేశ్వరి తెలిపారు. కరోనా కాలంలో దేశంలో మొట్టమొదటిసారిగా వర్చువల్ విధానంలో కేసుల విచారణ నిర్వహించిన హైకోర్టు ఏపీ హైకోర్టేనని వెల్లడించారు.

కొవిడ్-19 లాక్ డౌన్ ఉన్నా మార్చి 26 వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 27,462 కేసులను విచారించగా, 5,241 కేసులకు పరిష్కారం చూపామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టు ఆవరణలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేందర్ కుమార్ మహేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే ఆగస్టు 15వ తేదీ గుర్తించుకోదగిన రోజని అన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవమన్నారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానన్నారు. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణలో హైకోర్టు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు.

పేదలకు న్యాయం అందిండంలో కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కరోనా వల్ల క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా ఏపీ హైకోర్టు స్ఫూర్తి వంతంగా సేవలందిస్తోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్(వర్చువల్) ద్వారా  ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 27,462 కేసులను విచారించగా, 5,241 కేసులకు పరిష్కారం చూపామన్నారు.

దేశంలోనే వర్చువల్ హియరింగ్స్ ద్వారా కేసులు విచారించిన తొలి హైకోర్టు  ఏపీ హైకోర్టేనన్నారు. ఈ సందర్భంగా కేసుల సత్వర విచారణకు సహాయ సహకారాలు అందించిన హైకోర్టు ఉద్యోగులను, లాయర్లను చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ప్రత్యకంగా కొనియాడారు.

స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందరమూ పునరంకితం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. స్వామి వివేకాంద చెప్పిన విధంగా దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడూ బాధ్యత నిర్వర్తించాలన్నారు. 

కేసుల పరిష్కారంలో న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్న తీరును అభినందిస్తున్నానన్నారు. న్యాయ వ్యవస్థకు నిష్పక్షపాతం ఆత్మవంటిందని చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన ఇన్ఛార్జి రిజిస్టర్ బి.రాజశేఖర్, వీఆర్ సెక్షన్ అసిస్టెంట్ ప్రసాద్ నాయక్ సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు.

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనాతో యుద్ధ చేస్తోందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్ ప్రసంగించారు.

అనంతరం కొవిడ్ నివారణలో విశేష సేవలందించిన పలువురు ఉద్యోగులను చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఘనంగా సత్కరించారు. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో పోలీసు గౌరవ వందనాన్ని చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్లు, లాయర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, హైకోర్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.