శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 25 మే 2016 (13:35 IST)

తిరుపతి, తిరుమలలో భానుడి భగ.. భగ... రోడ్లన్నీ నిర్మానుష్యం

సూర్యభగవానుడు మళ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. తిరుపతిలో గత నాలుగురోజులుగా చల్లధనంతో ఊపిరి పీల్చుకున్న పట్టణ ప్రజలు ప్రస్తుతం ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఎండ వేడిమిని తట్టుకుని రోడ్లపైకి రావాలంటే భయపడి పోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. తిరుపతిలో 45డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ప్రధాన వీధులతో పాటు.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 
 
అదేసమయంలో వాహనచోదకుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఎండవేడిమితో పాటు వేడి గాలులు ఎక్కువగా వస్తుండడంతో పట్టణ వాసులు ఎండలతో బెంబెలెత్తిపోతున్నారు. తలకు టోపీ, కర్ఛీఫ్‌లను ముఖానికి కట్టుకుని పట్టణ వీధులలలో తిరుగుతున్నారు. కూల్‌డ్రింక్‌ షాపులు, జ్యూస్‌ షాపులకు మంచి గిరాకీ కనిపిస్తోంది. 
 
తిరుమలలో కూడా అదే పరిస్థితి. తిరుమలలో కూడా ఎండవేడిమిని భక్తులు తట్టుకోలేకపోతున్నారు. స్వామివారు కొలువుండే నాలుగు మాడా వీధుల్లోను భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అసలే భక్తుల రద్దీ. అందులో ఎండలు. దీంతో భక్తులు ఉక్కపోతను అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష నరకాన్ని భక్తులు చవిచూస్తున్నారు. క్యూలైన్లలోనే వేచి ఉండడంతో ఎండ వేడిమి నేరుగా భక్తులపైకే వస్తోంది. తిరుపతి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లకు వచ్చిన ఎండలోనే తిరుగుతూ పుణ్యక్షేత్రాలను సందర్సిస్తున్నారు.