1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (11:44 IST)

బాగా పడిపోయిన టమాటా ధర.. పొలాల్లోనే పారేస్తున్న రైతులు

ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా ఏపీలోని కర్నూలు జిల్లా మదనల్లికు పేరుంది. అలాంటి మార్కెట్‌లో టమాటాకు ఏమాత్రం గిట్టుబాటుధర లభించడం లేదు. టమాటా ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు నెలల క్రితం మంచి ధర పలకగా ప్రస్తుతం కొనేవారు కరవై మండీల్లోనే కుళ్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
నాలుగు రోజులుగా మార్కెట్‌ యార్డులో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. కొంతమంది రైతులైతే మార్కెట్‌కు తీసుకొచ్చిన సరకు తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక ఎంతో కొంతకు కొనాలని మండీ యజమానులను, వ్యాపారులను బతిమలాడుతున్నారు. శనివారం ఒక్కరోజే 30శాతానికి పైగా సరకు వేలంలో కొనలేదని సమాచారం.
 
మొన్నటి వరకు కిలో రూ.10 నుంచి రూ.12 పలికిన టమాటా ధర ఒక్కసారిగా రూ.5కు పడిపోయింది. ఇందులో కమీషన్‌ 10 శాతం, రవాణా ఛార్జీలు (క్రేటుకు రూ.10), క్రేట్లు బాడుగ, కూలీలు పోతే రైతుకు రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. 
 
ఇంకా రైతే చేతి నుంచి వేసుకోవాల్సి వస్తోంది. మొదటి రకం 30 కిలోల క్రేటు శనివారం మార్కెట్‌లో అత్యధికంగా రూ.150 పలికింది. రెండో రకం రూ.70 పలికింది. ప్రస్తుతం మార్కెట్‌కు రోజుకు 1,300 నుంచి 1,400 టన్నుల వరకు సరకు వస్తోంది. మదనపల్లె మార్కెట్‌కు రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా సరకు వస్తుంది. 
 
ఈ మార్కెట్ నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తుంటారు. ఎక్కువగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మార్కెట్‌కు తీసుకొచ్చిన టమాటాలను అడిగేవారు కరవయ్యారు.