వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టయి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, జైలు నుంచి వంశీ విడుదలకావడంలో జాప్యం నెలకొంది. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా జైలు అధికారులకు చేరకపోవడంతో ఆయన విడుదలలో జాప్యం నెలకొంది.
కాగా, ఈ కేసుల్లో అరెస్టయి జైలుకెళ్ళిన తర్వాత వల్లభనేని వంశీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స అందించాలని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ ఆరో తేదీన వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అయితే, వంశీ ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు. విజయవాడ జిల్లా జైలు అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమకు కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే వంశీని విడుదల చేస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.