శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (22:49 IST)

బెజవాడకు మణిహారం.. విజయవాడ వాసుల చిరకాల స్వప్నం... ఏంటది?

విజయవాడ నగర వాసుల చిరకాల స్వాప్నం నెరవేరనుంది. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లై ఓవర్ వంతెన త్వరలోనే వినియోగంలోకి రానుంది. దీంతో విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గిపోనున్నాయి. 
 
ఈ వంతెనను బెజవాడకు మణిహారంగా భావిస్తున్నారు. అలాంటి వంతెన ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైంది. సెప్టెంబరు నాలుగో తేదీన విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు ఏపీ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. 
 
విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులను మంత్రి శంకర్ నారాయణ పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
ఈ వంతెనను పరిశీలించిన తర్వాత మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, దుర్గ గుడి ఫ్లై ఓవర్ దాదాపు పూర్తైందని చెప్పారు. చిన్న చిన్న పనులను ముగించి వచ్చే నెల 4న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామన్నారు. 
 
వచ్చే నెల 4న ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్ర‌మంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని వెల్లడించారు. ఒక వైపు సంక్షేమం.. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శంకర్ నారాయణ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.