1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ.. కాలయముడైన భర్త...

murder
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ మహిళ పట్ల కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. ఫలితంగా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం జరిగాయి. పోలీసుల కథనం మేరకు.. 
 
ఆకివీడు 14వ వార్డులో నివసిస్తున్న మారడుగుల వీరవెంకట సత్యనారాయణ పెద్ద కుమార్తె సాయిలక్ష్మి కమల సంధ్య అలియాస్ సంధ్యారాణి అదే ప్రాంతానికి చెందిన వాడపల్లి రాంబాబు అనే వ్యక్తిని ప్రేమించి మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి 18 నెలల బాబు ఉన్నాడు. రాంబాబు గొలుసు చోరీ కేసులో జైలుకు వెళ్లడంతో సంధ్యారాణి(24) కుమారుడితో సహా పుట్టింటికి వచ్చేసి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాంబాబు భార్యతో గొడవపడి బిడ్డను తనకు ఇచ్చేయాలని ఒత్తిడి చేయసాగాడు. 
 
ఇదిలావుంటే, సంధ్యారాణి శనివారం ఉదయం తండ్రితో కలిసి స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చి తిరిగి ఇంటికి బయలుదేరింది. భర్త రాంబాబు అడ్డుకొని నడిరోడ్డుపైనే చాకుతో విచక్షణా రహితంగా పొడిచాడు. ఆ సమయంలో ఆమె పక్కన తండ్రి లేడు. కుమార్తె అరుపులు విన్న తండ్రి పరుగెత్తుకుంటా ఘటనా స్థలానికి చేరుకునేసరికి రాంబాబు పారిపోయాడు. 
 
భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణి.. రక్తపు మడుగులో పడిపోగా, ఆమెను స్థానికుల సాయంతో తండ్రి ఆస్పత్రికి తరలించాడు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. రాంబాబు ఆకివీడు పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్యారాణి తల్లిదండ్రులు.. బంధువులు మృతదేహాన్ని అక్కడికి తరలించి ఆందోళనకు దిగారు. 
 
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆందోళన కొనసాగగా ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీనాథు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.