శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 జులై 2019 (14:24 IST)

నాకు, బాబుకు తేడా ఉండాలి కదా: సీఎం జగన్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడ లేకుండా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని కొందరు తనకు సూచించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు చేసినట్టుగానే తాను కూడ చేయదల్చుకోలేదని తమ పార్టీ నేతలకు తాను స్పష్టం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. 
 
బుధవారం నాడు ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
చంద్రబాబునాయుడు సర్కార్ మాదిరిగా తమ ప్రభుత్వం వ్యవహరించకుండా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 18 ఎమ్మెల్యేల కంటే  తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షహోదా కోల్పోతారన్నారు.

అయితే తాము ఆ పని చేయదల్చుకోలేదన్నారు. ఒకవేళ తమ పార్టీలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు చేరాలనుకొంటే పదవికి రాజీనామా చేయడమో లేదో అనర్హతకు గురికావాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామాలు చేసి... తమ పార్టీ గుర్తుపై పోటీ చేయాలన్నారు.
 
గత ఐదేళ్లలో తమకు సభలో మాట్లాడకుండా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మైక్‌కట్ చేయడమో.... లేదా వ్యక్తిగత విమర్శలకు దిగడమో చేసేవారన్నారు. కానీ ఈ దఫా విపక్షం కూడ మాట్లాడేందుకు అవకాశం ఇస్తామన్నారు. విపక్ష సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ధీటుగా సరైన సమాధానం చెబితే ప్రజలు నమ్ముతారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి రోజూ సభకు హాజరుకావాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.