1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (09:48 IST)

నువ్వైనా బతుకు బిడ్డా... కూతుర్ని ప్లాట్‌ఫాంపైకి విసిరేసి తాను మృత్యుఒడికి చేరిన తల్లి.. ఎక్కడ?

నవమాసాల మోసి పెంచిన బిడ్డ తన ఎదుటే చనిపోవడం ఆ తల్లికి సుతరామా ఇష్టంలేదు. దీంతో ఆ తల్లి కన్నబిడ్డ కోసం తాను ప్రాణత్యాగం చేసింది. నువ్వైనా బతుకు బిడ్డా.. నేను చనిపోతున్నా అంటూ ఆ తల్లి చెప్పిన మాటలు అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరినీ కంట తడబెట్టించాయి. చంకన బిడ్డనెత్తుకుని, కదులుతున్న రైలెక్కబోయి ప్రమాదవశాత్తూ కిందపడిన మహిళ... ఆ పసిబిడ్డను ప్లాట్‌ఫాంపైకి విసిరేసి తాను మృత్యు ఒడికి చేరింది. ఈ విషాద సంఘటన గురువారం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారానికి చెందిన చిర్ర సంతోష్‌, రజని (25) దంపతులకు ముగ్గురు పిల్లలు. హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకని సంతోష్‌ కుటుంబం రైల్వేస్టేషన్‌కు వచ్చింది. టికెట్టు తీసుకుని పుష్‌పుల్‌ ప్యాసింజర్‌లో భర్త, ఇద్దరు పిల్లలు, మిగతా బంధువులు రైలెక్కారు. అప్పటికే రైలు కదలగా చంకలో ఏడాదిన్నర వయసున్న సాత్వికను పెట్టుకుని రైలు ఎక్కేందుకు రజని ప్రయత్నించింది. 
 
ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడటంతో వెంటనే చంకలో ఉన్న బిడ్డను ప్లాట్‌ఫాంపైకి విసిరేసింది. రైల్లో ఉన్న భర్త, బంధువులు కేకలు వేస్తుండగానే క్షణాల్లో రైలుచక్రాల కింద నలిగి రజని ప్రాణాలు విడిచింది. రైల్వే పోలీసులు వెంటనే పుష్‌పుల్‌ను నిలిపివేయించి, రజని మృతదేహాన్ని బయటకు తీశారు. ప్లాట్‌ఫాంపై పడటంతో సాత్విక రెండు కాళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. తండ్రి ఒడిలో కూర్చుని అమ్మా, అమ్మా అంటూ ఆ పసిబిడ్డ రోదించడం అందరినీ కలచివేసింది.