ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సెటైర్లు వేస్తున్న చంద్రబాబు : జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధనకు వైసీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేన్నారు.
ప్రత్యేక హోదా వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం పదేపదే జపాన్, సింగపూర్ వెళ్లక్కర్లేదని, ఈ విషయం ఆయనకు కూడా తెలుసన్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రత్యేక హోదా కోసం నిరంతర పోరాటాలు చేస్తుంటే, కనీసం దీనిపై బాబు నోరు విప్పడం లేదన్నారు. పైగా ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనినిబట్టి హోదా విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రకటిస్తే.. పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడేమయ్యారు? అని జగన్ ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబులు ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు సీఎం జాబులో కూర్చున్నారని జగన్ అన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతోంది.. ఎవరికైనా జాబులు ఇచ్చారా అని నిలదీశారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలుసా? రాష్ట్రం అధోగతి పాలైంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు.. వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక బాబు పదేపదే కుంటి సాకులు చెబుతున్నారు. రుణమాఫీ చేస్తానన్నారు, అది కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు.