గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (14:25 IST)

బ్రిటన్ వెళ్లాలి.. అనుమతివ్వండి.. సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

jagan
తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ వెళ్ళాలని అందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశఆరు. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
 
అంతకుముందు... యూరప్‌లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతించాలంటూ రెండో నిందితుడైన విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సాయిరెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి ఈ కోర్టు అనుమతించిందన్నారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసు విచారణ ముందుకుసాగడంలేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
 
ఇదిలావుంటే, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లికి తిరిగొచ్చారు. ఈ నెల 15వ తేదీన ఆయన బెంగళూరు వెళ్లారు. జూన్ నుంచి ఇప్పటివరకూ మొత్తం ఆరుసార్లు అక్కడికి వెళ్లొచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో జగన్‌కు వైకాపా నేతలు స్వాగతం పలికారు. వచ్చే నెలలో ఆయన యూకే పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న డిప్లమాటిక్ పాస్‌పోర్టును ఈ నెల 1న కార్యాలయంలో సమర్పించి సాధారణ పాస్‌పోర్టును తీసుకున్నారు.