1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 18 ఫిబ్రవరి 2021 (20:17 IST)

ఉన్నావ్‌: పొలంలో టీనేజీ బాలికల శవాలు: Newsreel

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన పొలంలో 13, 16 సంవత్సరాల దళిత అమ్మాయిల మృత దేహాలు లభించాయి. అదే ప్రదేశంలో కనిపించిన మరో 17 ఏళ్ల అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల మృత దేహాలు బుధవారం లభించినట్లు వారి కుటుంబాలు చెబుతున్నాయి. పెద్ద అమ్మాయిలు ఇద్దరూ అక్కా చెల్లెల్లు కాగా, 13 సంవత్సరాల బాలిక వారి బంధువు.

 
వారి కాళ్లు, చేతులు వాళ్ల దుస్తులతోనే కట్టేసి ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం పశువులకు దాణా తీసుకొచ్చేందుకు ముగ్గురు బాలికలు పొలానికి వెళ్లారు. వారు చాలా సేపటి వరకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో, వారి కోసం వెతకడం మొదలు పెట్టినట్లు వారి కుటుంబ సభ్యులు చెప్పారు.

 
అయితే, ఆ అమ్మాయిలు విష ప్రయోగం వలన మరణించి ఉంటారని ఒక సీనియర్ పోలీసు అధికారి అన్నారు. వారి నోటి నుంచి ఏదో తెల్లని ద్రవం వచ్చిందని, అది విషం బారిన పడిన లక్షణమని డాక్టర్లు చెబుతున్నారు. "ఈ సంఘటనలో అందరి సాక్ష్యాలు తీసుకుంటున్నాం. అన్ని కోణాల్లో విచారణ చేస్తాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం" అని పోలీస్ సూపరింటెండెంట్ సురేష్ రావు చెప్పారు.

 
ఈ అమ్మాయిలు దళిత కుటుంబాలకు చెందినవారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసులతో ఉన్నావ్ జిల్లా వార్తల్లో ఉంది. సామూహిక అత్యాచారం జరిగిందనే కేసు విచారణ నిమిత్తం 2019లో కోర్టుకు వెళ్తున్న 23 ఏళ్ల ఉన్నావ్ మహిళపై దుండగులు దాడికి పాల్పడి, ఆమెకు నిప్పు అంటించారు. ఆ తరువాత ఆమె తీవ్ర గాయాలతో మరణించారు. 2019లో నమోదైన అత్యాచార కేసులో ఉన్నావ్‌కు చెందిన బీజేపీ నాయకుడు జైలుకెళ్లారు.