1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 మే 2021 (16:37 IST)

లాక్ డౌన్.. ఛార్మినార్ వద్ద భారీ రద్దీ.. ఇలాగైతే కోవిడ్ కేసులు పెరగవా...?(video)

charminar
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. రెండో రోజైన గురువారం హైదరాబాద్‌లోని అన్ని మార్కెట్లలో భారీగా రద్దీ పెరిగింది. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పాతబస్తీ మార్కెట్లు కిక్కరిసిపోయాయి. రంజాన్ షాపింగ్‌తో ఓల్డ్ సిటీ కిటకిటలాడింది.

ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ మినహాయింపు ఉండటంతో జనమంతా రోడ్లపైకి వచ్చారు. నిత్యావసర వస్తువులతో పాటు తమకు అవసరమైన వస్తువులను తీసుకెళ్లారు.
 
లాక్ డౌన్ సడలింపు సమయం కేవలం 4 గంటలు మాత్రమే ఉండటంతో ఆలోగా తమ పనులు పూర్తిచేసుకునేందుకు జనమంతా పరుగులు తీశారు. ఈ క్రమంలో మార్కెట్లలో ఎక్కడా కూడా భౌతిక దూరం కనిపించలేదు. మాస్క్ లు ధరించినప్పటికీ జనం రద్దీగా ఉండటంతో చార్మినర్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 
 
పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌కు వేళ కావడంతో బయటకు వచ్చిన జనమంతా ఇళ్లకు బయల్దేరుతున్నారు. అన్ని ట్రాఫిక్‌ కూడళ్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లు పెట్టి పలు ఫ్లైఓవర్లను పోలీసులు మూసేస్తున్నారు.
 
లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకున్నారు.
 
రిజర్వేషన్ ఉన్నవారినే చెక్ చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్ లోపలికి అనుమతించారు. అయితే లాక్డౌన్ పేరిట మార్కెట్లు వంటి ప్రాంతాల్లో జనం అధిక సంఖ్యలో తిరగడంతో కరోనా పాజటివ్ సంఖ్య పెరిగే అవకాశం వుందని ఆందోళన మొదలైంది.