గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (09:16 IST)

ఆత్మవిశ్వాసంలో భారత్.. ఆధిక్యం కోసం ఇంగ్లండ్ తపన!

స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భారత్ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే, ఓపెనర్ ఇషాన్ కిషన్ తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. 
 
ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది. ఆదివారం మ్యాచ్‌లో భారత బౌలర్లు స్లో బంతులతో ఇంగ్లండ్‌ను భారీస్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఛేదనలో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మిగతా పని కానిచ్చారు. దీంతో కోహ్లీసేన 7 వికెట్లతో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 
 
ఇప్పుడు అదే జోష్‌తో మరో దెబ్బతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలన్న ఆలోచనలో ఉంది. అటు ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో చాంపియన్‌ తరహాలో ఆడినా, తర్వాత తేలిపోయింది. స్టార్‌ హిట్టర్లున్నా భారీషాట్లు ఆడలేకపోయారు. ఈసారి ప్రత్యర్థికి మరో విజయం ఇవ్వకూడదనే కసితో ఇంగ్లండ్‌ ఉంది.
 
మరోవైపు, ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ అంచనాలకు మించి రాణించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు రోహిత్‌ శర్మపై అందరి దృష్టీ నెలకొంది. అతడి విశ్రాంతి ముగియడంతో జట్టులోకి వచ్చే అవకాశముంది. దీంతో రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపర్చిన రాహుల్‌పై వేటు పడే అవకాశం లేకపోలేదు. 
 
ఒకవేళ మరో చాన్సివ్వాలనుకుంటే అతడిని మిడిలార్డర్‌లో ఆడించి, సూర్యకుమార్‌ను తప్పించొచ్చు. కెప్టెన్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావడం జట్టుకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, ఓ ఆల్‌రౌండర్‌ ఫార్ములాకే కట్టుబడనున్నారు.
 
ఇరు జట్లు (అంచనా)
భారత్ ‌: రోహిత్ శర్మ‌, ఇషాన్ కిషన్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్ పాండ్యా‌, వాషింగ్టన్ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్, భువనేశ్వర్‌, చాహల్‌.
 
ఇంగ్లండ్‌: రాయ్‌, బట్లర్‌, మలాన్‌, బెయిర్‌స్టో, మోర్గాన్‌ (కెప్టెన్‌), స్టోక్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కర్రాన్‌, ఆర్చర్‌, రషీద్‌, జోర్డాన్‌.