శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (13:48 IST)

జెర్సీ ధరించి... త్రివర్ణ పతాకం చూడగానే అదోలా అనిపించింది.. : ఇషాన్ కిషన్

స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో ట్వంటీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అందులో ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్, మరో మ్యాచ్‌లో భారత్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. అయితే, ఆదివారం రాత్రి మోతేరా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ కుర్రోడు... తొలిసారి బరిలోకి దిగినప్పుడు ఆందోళనకు గురయ్యానని చెప్పాడు. అయితే, టీమ్ఇండియా జెర్సీ ధరించి, జాతీయ జెండాను చూస్తే అత్యుత్తమ ప్రదర్శన చేయాలనిపించిందని అన్నాడు. 
 
గతరాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఇషాన్‌ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 56 రన్స్ చేసి కీలక పాత్ర పోషించాడు. కొత్త అనే బెరుకు లేకుండా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడాడు. ఈ క్రమంలోనే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (73; 49 బంతుల్లో 5x4, 3x6)తో కలిసి రెండో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. దాంతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి అభిమానుల మన్ననలు పొందాడు.
 
మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కిషన్‌.. తన బ్యాటింగ్‌పై స్పందించాడు. తాను ఇక్కడిదాకా రావడానికి ఎంతో మంది కృషి చేశారని చెప్పాడు. అలాగే ముంబై ఇండియన్స్‌ సారథి, టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తనకు అండగా నిలిచాడన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ తనతో మాట్లాడాడని తెలిపాడు. 
 
"రోహిత్‌ భాయ్‌ నా వద్దకు వచ్చి నేను ఈరోజు ఓపెనింగ్‌ చేస్తున్నానని చెప్పాడు. అలాగే ఎలాంటి ఆందోళనా లేకుండా ఐపీఎల్‌లో ఆడినట్లే ఇక్కడా ప్రశాంతంగా ఆడమన్నాడు. కానీ, బరిలోకి దిగినప్పుడు నేను ఆందోళనకు గురయ్యా. చివరికి టీమ్‌ఇండియా జెర్సీ ధరించి భారత జెండాను చూశాక.. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని అనుకున్నా" అని కిషన్‌ వివరించాడు.
 
ఇక తర్వాత అర్థ శతకం పూర్తిచేసిన విషయం తనకు తెలియదని, కోహ్లీ అభినందించినప్పుడే తెలిసిందన్నాడు. ‘విరాట్‌ భాయ్‌ టాప్ ఇన్నింగ్స్‌ అని ప్రశంసించాడు. అప్పుడే నేను అర్థశతకం సాధించానని అర్థమైంది. కానీ, సహజంగా నేను 50 పరుగులు చేసినప్పుడు బ్యాట్‌ పైకెత్తను. కోహ్లీ గట్టిగా అరుస్తూ మైదానం నలువైపులా బ్యాటెత్తి చూపమన్నాడు. ఇది నీ తొలి మ్యాచ్‌ అందరికీ బ్యాట్‌ చూపించు అని అన్నాడు. అప్పుడే నేను బ్యాట్‌ పైకెత్తాను. అది నాకు ఆజ్ఞాపించినట్లు అనిపించింది' అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ - కోహ్లీ కారణంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించి, తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.