సీఎస్కేకు చుక్కలు చూపిన కేకేఆర్... ధోనీ సేన ఘోర పరాజయం!!
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. 104 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్ (44), డికాక్ (23) రాణించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్, నూర్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సీఎస్కే బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేశారు. ఈ సీజన్లో చెన్నై జట్టుకు తొలిసారి కెప్టెన్గా వ్యవహరించిన ధోనీ (1) నిరాశపర్చాడు. శివమ్ (31), విజయ్ శంకర్ (26) జట్టును ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లలో రచిన్ 4, కాన్వే 12, రాహుల్ త్రిపాఠి 16, అశ్విన్ 1, జడేజా 0, దీపక్ హుడా 0, నూర్ అహ్మద్ 1, అన్షుల్ 3 పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ 2, హర్షిత్ రాణా 2, అలీ 1, వైభవ్ 1 చొప్పున వికెట్లు పడగొట్టారు.
ఐపీఎల్ తాజా సీజన్లో చెన్నై జట్టుకు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదు. రుతురాజ్ గాయంతో జట్టుకు దూరంగా కాగా, కెప్టెన్గా ధోనీ పగ్గాలు చేపట్టినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా, మరింత దిగజారిందని, తాజా ఓటమి చెబుతోంది.