ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (23:18 IST)

ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్ : క్రికెట్ పసికూనపై భారత్ ఘన విజయం

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, బుధవారం రాత్రి భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ జట్టు 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగింది. అయితే, భారత బౌలర్లు బాగా కట్టడి చేశారు. షమీ, బుమ్రా ఇద్దరూ ఆఫ్ఘన్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ ఓపెనర్లు మంచి పునాది వేయలేక పోయారు. ఆఫ్ఘన్ ఓపెనర్లు షెహజాద్‌ (0), జజాయ్‌ (13) పరుగులు చేసి అవుటయ్యారు. అయితే ఆ తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్‌ (19) రెండు సిక్సర్లు, ఫోర్‌ బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న అతన్ని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. బౌండరీలైన్ వద్ద పాండ్యా అందుకున్న చక్కటి క్యాచ్‌కు అతను పెవిలియన్ చేరాడు. 
 
మ్యాచ్ పదో ఓవర్‌లో ఆర్. అశ్విన్ బంతిని తీసుకున్నాడు. సుమారు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన అశ్విన్ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లో గుల్బాదిన్ నైబ్‌ (18)ను ఎల్బీగా అవుట్ చేసిన అతను.. మూడో ఓవర్లో నజిబుల్లా జద్రాన్‌ (11)ను బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేద్దామనుకున్న అతను ఆ బంతి మార్గాన్ని అంచనా వేయలేకపోయాడు. దీంతో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ఆప్ఘాన్ స్కోరు 69 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. 
 
ఆ ర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నబి 35, జనత్‌ 42 (నాటౌట్) చొప్పున పరుగులు చేసిన భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఫలితంగా ఆరో వికెట్ భాగస్వామ్యంగా 57 పరుగులు చేశారు. అయితే, నబి 35, రషీద్ ఖాన్ 0 పరుగుల మీద ఔట్ అయ్యారు. అప్పటికి ఆప్ఘన్ స్కోరు 18.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. చివరకు ఆప్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమి 3, అశ్విన్ 2, బుమ్రా, జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు.. ఆఫ్ఘనిస్థాన్‌ జట్టుపై టీమిండియా విజృంభించి ఆడింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (74), కేఎల్ రాహుల్‌ (69) చెలరేగి ఆడారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌ (13 బంతుల్లో 27 నాటౌట్), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 35 నాటౌట్) దుమ్మురేపారు. బ్యాట్స్‌మెన్‌ అందరూ అదరగొట్టడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
 
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘన్ బౌలర్లలో కరీమ్ జనత్, గుల్బాదిన్ నైబ్ చెరో వికెట్ కూల్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్‌ చేయడానికి రాకపోవడం గమనార్హం. 15వ ఓవర్లో రోహిత్‌ వికెట్‌ పడిన తర్వాత హార్డ్ హిట్టర్ల అవసరం ఉందని గ్రహించిన టీమిండియా.. పంత్‌ను రంగంలోకి దింపింది. ఆ తర్వాత రాహుల్ అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యాను బరిలో దింపారు. దీంతో కోహ్లీకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.