శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (16:08 IST)

దంచి కొట్టిన ఆస్ట్రేలియా : భారత్ టార్గెట్ 195 రన్స్

సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో ట్వంటీ 20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (58), స్టీవ్ స్మిత్ (46), హెన్రిక్స్ (26), మ్యాక్స్ వెల్ (22) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 రన్స్ చేసింది. 
 
రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వేడ్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వేడ్ 32 బంతులాడి 10 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ అందరూ దూకుడుగా ఆడేందుకు ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ స్కోరుబోర్డు విశ్రమించలేదు.
 
ఇకపోతే, భారత బౌలర్లలో నటరాజన్ మరోసారి రాణించాడు. ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ 2 వికెట్లు తీసి తన ఎంపికకు న్యాయం చేశాడు. షమీ, బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్ల గైర్హాజరీలో దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్ తేలిపోయారు. తొలి టీ20 విజయంలో కీలకపాత్ర పోషించిన చహల్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు విసిరి 51 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. 
 
ఆ తర్వాత 195 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన భారత జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (30), శిఖర్ ధవాన్ (24)లు రాణిస్తున్నారు. ప్రస్తుతం ఐదు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ధావన్ 11 బంతుల్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్ల సాయంతో 24 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.