శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (11:30 IST)

రెండో ట్వటీ20 : సిరీస్‌పై కన్నేసిన కోహ్లీ సేన

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఆతిథ్య ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిస్తే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంటుంది. 
 
సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే ఈమ్యాచ్‌లో కంగారూలు తప్పక గెలవాల్సి ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది. తొలి టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తలకు బంతి తగలడంతో రవీంద్ర జడేజా టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. 
 
కాగా, ఓవల్ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జరిగిన కోహ్లీ సేన విజయం సాధించింది. ఇపుడు నిర్ణయాత్మక రెండో పోరులో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. మిడిలార్డర్‌ విఫలమైనా.. బౌలర్లు విజృంభించడంతో కాన్‌బెర్రాలో బోణీ చేసిన కోహ్లీ సేన.. ఆదివారం సిడ్నీ వేదికగా ఆసీస్‌తో రెండో టీ20లోనూ నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. 
 
ఈ మైదానంలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్‌ ఓటమి పాలవగా.. ఆ పరాజయాలను పక్కనపెట్టి ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తున్నది. గత మ్యాచ్‌లో స్టార్క్‌ బౌన్సర్‌ ధాటికి గాయపడ్డ రవీంద్ర జడేజా సిరీస్‌కు దూరం కావడం భారత్‌ను కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఫ్లాట్‌ పిచ్‌పై టాపార్డర్‌ గాడిన పడకుంటే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ జరిగిన తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉండనుంది. వర్ష సూచన లేదు. 
 
తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, శాంసన్‌, మనీశ్‌/అయ్యర్‌, హార్దిక్‌, సుందర్‌, దీపక్‌, నటరాజన్‌, బుమ్రా, చాహల్‌.
 
ఆస్ట్రేలియా: ఫించ్‌/వేడ్‌ (కెప్టెన్‌), షార్ట్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అబాట్‌, స్టార్క్‌, లియోన్‌, జంపా, హజిల్‌వుడ్‌.