భారత్ - పాకిస్థాన్ యుద్ధం - ఐపీఎల్ 2025 పోటీలు రద్దు
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధంమొదలైంది. దీంతో ఇరు దేశాలమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. దీంతో గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పూర్తిగా రద్దు చేసింది.
కాగా, ఈ టోర్నీలోభాగంగా, గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ను అర్థాంతరంగా రద్దు చేశారు. భద్రతా కారణాలతోనే ఆపేసినట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ కూడా ప్రేక్షకులు త్వరగా వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశాడు.
జమ్మూకాశ్మీర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ముందస్తుగా ఆటను నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, ఐపీఎల్ సభ్యులు, ప్రేక్షకులు మైదానాన్ని ఖాళీ చేసేశారు. ఈ క్రమంలో ఓ ఛీర్ లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
"స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉంది. ప్రతిఒక్కరూ బాంబులు వస్తాయేమోనని అరుస్తూ వెళ్లిపోయారు. ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారు. అయితే, నేను ఎందుకు ఏడవడం లేదనేది తెలియడం లేదు. ఇప్పటికీ షాక్లోనే ఉన్నా' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో వీడియో వైరల్గా మారింది.
మరోవైపు, ధర్మశాల నుంచి ఆటగాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ధర్మశాలలో విమానాశ్రయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీకి తీసుకెళ్లేందుకు వందే భారత్ రైలును బీసీసీఐ అధికారులు ఏర్పాటుచేశారు. దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై చైర్మన్ అరుణ్ ధుమాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.