వారం రోజుల పాటు ఐపీఎల్ నిలిపివేత : బీసీసీఐ ప్రకటన
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2025 పోటీలను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, పాకిస్థాన్ సాయుధ బలగాల దుందుడుకు చర్యలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
క్రికెట్ మన దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన క్రీడ అయినప్పటికీ దేశ సార్వభౌమాధికారం సమగ్రత, భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని, బీసీసీఐ నొక్కి చెప్పింది. భారతదేశాన్ని రక్షించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాడానికి బీసీసీఐ కట్టుబడివుందని, ఎల్లపుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపి, అర్థం చేసుకున్నందుకు లీగ్ అధికారిక ప్రసారదారు జియోస్టార్కు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అలాగే, టైటిల్ స్పాన్సర్ టాటా, ఇతర అనుబంధ భాగస్వాములు, వాటాదారులకు కూడా దేశ ప్రయోజనాలను అన్నింటికంటే ఉన్నతమైనవిగా భావించి, ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపింది.