గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (08:19 IST)

పూణె వేదికగా మూడో వన్డే : నేడు చావో రేవో...

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన మూడో వన్డే మ్యాచ్ ఆదివారం పూణె వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవోగా మారింది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలో మ్యాచ్‌లో గెలుపొంది సమఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే కోసం ఇరు జట్లూ శక్తికి మించి పోరాడనున్నాయి. 
 
ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, ఇంగ్లండ్‌ను ఒట్టి చేతులతో పంపించాలని భారత చూస్తుండగా, వన్డే సిరీస్‌నైనా గెలుచుకుని కొంత పరువు నిలుపుకుని స్వదేశానికి వెళ్ళాలన్న పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. 
 
ఇక మూడో వన్డే పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఇదేసమయంలో సీమర్లకు కొంత స్వింగ్ కూడా లభిస్తుందని తెలుస్తోంది. నిలదొక్కుకుని ఆడితే భారీ స్కోరు సాధించడం సులువేనని క్యూరేటర్లు అంటున్నారు. అయితే, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. 
 
రెండో వన్డేలో ఇదే జరిగింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 337 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచినా, అలవోకగా ఇంగ్లండ్ ఛేదించింది. అదే ఉత్సాహాన్ని మూడో వన్డేలోనూ చూపాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత ఆడే జట్టు కనీసం 350 పరుగులు చేస్తేనే గెలిచేందుకు పూర్తి అవకాశాలు ఉన్నట్టని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
ఇదిలావుండగా, రెండో వన్డేలో భారీగా పరుగులు ఇచ్చి విఫలమైన కుల్దీప్, కునాల్ స్థానంలో చాహల్, సుందర్‌లను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కృనాల్ బ్యాటింగ్ స్కిల్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే, తుది జట్టులో ఉంటాడనే భావించవచ్చు. 
 
ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 90 పరుగులు చేస్తే, వన్డేల్లో ఆరు వేల పరుగులు చేసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.