శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (11:35 IST)

ఓటు వేయాలంటూ ప్రచారం.. చివరకు ఓటే లేకుండా పోయింది....

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కర్ణాటక ఎన్నికల సంఘం అంబాసిడర్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరకు ఆయనకే ఓటు లేకుండా పోయింది. దీనికి కారణం ఆయనతో పాటు.. ఆయన సోదరుడు చేసిన చిన్నతప్పిదమే. ఈ తప్పిదం కారణంగా రాహుల్ ద్రావిడ్‌కు చివరకు ఓటు హక్కే లేకుండా పోయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దేశ భవిష్యత్‌ను నిర్ధేశించేది ఓటు అని, 18 యేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అలా ప్రచారకర్తల్లో రాహుల్ ద్రావిడ్ కూడా ఒకరు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. 
 
గత కొన్ని సంవత్సరాలుగా ద్రావిడ్ బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని ఇందిరా నగర్‌లో ఉంటున్నారు. ఆ చిరునామాలోనే ద్రవిడ్‌కు ఓటు ఉంది. అయితే, ఇటీవల ఆయన తన ఇంటిని మార్చారు. మల్లేశ్వరంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి చేరుకున్నారు. ఈ ప్రాంతం బెంగుళూరు నార్త్‌ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇంటిని మార్చాడే కానీ, తన ఓటును మాత్రం మార్చుకోలేదు. 
 
అదేసమయంలో తన అన్న ఇల్లు మారాడని, అందువల్ల ఆయన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలని బెంగుళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి దరఖాస్తు ద్రావిడ్ సోదరుడు సమర్పించాడు. దీంతో ఓటరు జాబితా నుంచి ద్రావిడ్ పేరును తొలగించారు. కానీ, కొత్త నియోజకవర్గంలో ఓటు నమోదు గడువు ముగిసే సమయానికి వెరిఫికేషన్ కోసం అధికారులు ఆయన ఇంటికి వెళ్లే సమయానికి ద్రావిడ్ విదేశాల్లో ఉన్నారు. దీంతో ద్రావిడ్ పేరు కొత్త నియోజకవర్గంలో తయారు చేసిన ఓటరు జాబితాలో లేకుండా పోయింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తూ ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేసే రాహుల్ ద్రావిడ్‌కు చివరకు అతనికే ఓటు లేకుండా పోయింది.