1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (09:44 IST)

జయసూర్య రికార్డు మాయం... రో'హిట్' వరల్డ్ రికార్డు

భారత పరుగుల యంత్రం రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవడమే కాకుమడా, ఏకంగా ప్రపంచ రికార్డును బద్ధలుకొట్టాడు. క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. 
 
కటక్ వేదికగా జరిగిన వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 63 పరుగులు చేసి అవుటయ్యాడు. తద్వారా ఈ సీజనులో మొత్తం 2,442 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుముందు శ్రీలంక విధ్వంసక ఆటగాడు సనత్ జయసూర్య పేరిట ఉంది. ఎడమచేతివాటం ఆటగాడు జయసూర్య 1997 సీజనులో 2,387 పరుగులు సాధించాడు. 
 
భారత్ ఖాతాలో పదో వన్డే సిరీస్ 
కటక్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీమోగించింది. 316 భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. తొలుత రోహిత్ శర్మ (63), కేఎల్ రాహుల్ (77) పటిష్టమైన పునాది వేయగా, ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో 85 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. 
 
ఓ దశలో వరుసగా వికెట్లు పడినా రవీంద్ర జడేజా (39 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 పరుగులు) మొండిపట్టుదలతో పోరాడి టీమిండియాను గెలిపించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసిన విషయం తెల్సిందే. వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. విశాఖలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలుపొందింది. దీంతో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచిన జట్టే సిరీస్ విజేతగా నిలిచింది. 
 
అయితే, బ్యాటింగ్‌కు అనుకూలించే ఇక్కడి పిచ్ పై ప్రమాదకర విండీస్ ఓపెనర్లను ఓ మోస్తరు స్కోర్లకు అవుట్ చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్‌కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) శుభారంభాన్నందించారు. తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అలాగే, ఛేజ్ 38, హత్మియర్ 37, పూరన్ (89), పొల్లార్డ్ (74), హోల్డర్ (7)లు చొప్పున పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఫలితంగా భారత్ ముందు 316 భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్‌ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్‌ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే, కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ కటక్‌లో నిప్పులు చెరిగాడు.