బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (18:02 IST)

కోహ్లీనా మజాకా.. రికార్డుల పంట పండించాడు.. అఫ్రిదీ కితాబిచ్చాడు.. (video)

దక్షిణాఫ్రికాతో మొహాలీ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (72 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 2441 పరుగులు సాధించాడు. తద్వారా అంతముందు వరకు ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (2434) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న కోహ్లీ మొత్తం మూడు సిక్సులు, నాలుగు బౌండరీలు బాదడంతో టీ-20ల్లో అర్థ సెంచరీతో భారత గెలుపులో కీలక పాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లీకి ఇది 11వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కావడం విశేషం.
 
ఇక్కడితో కోహ్లీ ఆగలేదు.. కోహ్లీ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది రికార్డుని సమం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది (11 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) పేరిట వున్న అవార్డుల రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఈ జాబితాలో ఆప్ఘన్‌కు చెందిన మహ్మద్ నబీ(12) అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు టీ20ల్లో 50కిపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం. ఈ క్రమంలో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజిని కలిగి ఉన్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిది.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి అత్యధిక హాఫ్‌ సెంచరీలు విషయాన్ని ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఇందుకు అఫ్రిదీ రీ ట్వీట్ చేశాడు. ఇంకా ఆ ట్వీట్‌లో కోహ్లీని కొనియాడాడు. విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడని, అతని సక్సెస్ ఇలాగే కొనసాగాలన్నాడు. ఇదే తరహాలో ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల్ని ఆటతీరుతో అలరించాలని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.