1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (16:44 IST)

పిచ్ మార్పుపై పిచ్చి కూతలొద్దు.. పాక్ క్రికెటర్లకు గవాస్కర్ వార్నింగ్

sunil gavaskar
ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‌లో పిచ్ మార్పుపై వ్యాఖ్యానిస్తున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పిచ్చిగా మాట్లాడకండి, నోరు మూసేయండి, మాటలు ఆపండి.. అంటూ కోపంగా కామెంట్లు చేశారు. 
 
ప్రపంచ కప్ 2023లో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్స్‌లో పిచ్ విషయంలో కుట్ర జరిగిందనే ఆరోపణలపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. చివరి నిమిషంలో భారత స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్‌ని మార్చారనే విమర్శలపై మ్యాచ్ అనంతరం సునీల్ స్పందించాడు.
 
సెమీఫైనల్ ప్రారంభానికి ముందు పిచ్‌ను మార్చారని, ఇప్పటికే భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉపయోగించారని ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐపై విమర్శించాయి. నిజానికి దీనిపై ఐసీసీ కూడా క్లారిటీ ఇచ్చినా విమర్శలు ఆగలేదు. 
 
చివరికి ఈ పిచ్‌పై 700కు పైగా స్కోరు నమోదు కావడంతోపాటు పేసర్లు ఎక్కువ వికెట్లు పడగొట్టి విమర్శకుల నోళ్లు మూయించారు. అయితే ఈ విమర్శలపై మ్యాచ్ అనంతరం గవాస్కర్ సీరియస్‌గా స్పందించాడు. 
 
" వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ఫైనల్ చేరితే గర్వంగా ఫీలవుతాను. ప్రపంచకప్ మరింత ప్రత్యేకం. భారత్ తనదైన శైలిలో చేసింది. వారు 400 పరుగులు చేశారు. పిచ్ చాలా బాగుంది. అందులో 700కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. భారత స్పిన్నర్ల కోసం పిచ్‌ను మార్చాలని ఏడుస్తున్న మూర్ఖులందరూ నోరుమూయండి. 
 
భారత్‌ను విమర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. ఇదంతా పిచ్చి. పిచ్ మారిస్తే టాస్‌కు ముందు మార్చేస్తారు. ఇది టాస్ తర్వాత లేదా ఇన్నింగ్స్ మధ్యలో మార్చబడదు. ప్రపంచకప్ జట్టుగా మనం ఆ పిచ్‌పై ఆడి గెలవాలి. భారత్ కూడా అదే చేసింది. కాబట్టి పిచ్ గురించి మాట్లాడటం మానేయండి' అని గవాస్కర్ మ్యాచ్ తర్వాత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు.