శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 8 జనవరి 2023 (11:00 IST)

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్

surya kumar yadav
భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. శనివారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా పర్యాటక శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా తన టీ20 కెరీర్‌లో మూడో సెంచరీ నమోదు చేసుకున్నాడు. అయితే, ఈ రాజ్‌కోట్‌లో చేసిన సెంచరీ మాత్రం అతని కెరీర్‌లో ది బెస్ట్ సెంచరీగా మిగిలిపోయింది. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫలితంగా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అతడికంటే ముందు వరుసలో ఉన్నారు. 
 
గత 2017లో ఇండర్‌లో శ్రీలంకతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లో శతకం చేశాడు. సూర్య తర్వాత కేఎల్ రాహుల్ (46) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత రెండు స్థానాల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఉండటం గమనార్హం. గత యేడాది నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‍లో 48 బంతుల్లోనూ, మౌంట్‌మాంగనూయిలో జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో సూర్య కుమార్ సెంచరీ బాదాడు. అయితే తాజాగా చేసిన సెంచరీ స్వదేశంలో చేసిన తొలి సెంచరీ కావడం గమనార్హం. 
 
రాజ్‌‍కోట్ వన్డేలో భారత్ గెలుపు... 2-1 తేడాతో సిరీస్ వశం 
పర్యాటక శ్రీలంక జట్టుతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో 2-1 తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. మిస్టర్ 360గా పేరుగాంచిన బ్యాటర్ సూర్యకుమార్ తనదైనశైలిలో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 51 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 228 పరుగులుచేసింది. 
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో షనక 23, ఓపెనర్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, అసలంక 19 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్‌గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు లంక వెన్ను విరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రామన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశాడు. 
 
ఈ మ్యాచ్‌ విజయంతో మూడు టీ20ల సిరీస్‌‍లను టీమిండియా 2-1 కేవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా ఈ నెల 10వ తేదీన గౌహతి వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది.